రాహుల్ గాంధీకే నోబెల్ బహుమతి ఇవ్వాలన్న బీజేపీ.. దీని వెనుక మతలబ్ ఏంటంటే?

Image 1

నోబెల్ ప్రైజ్‌పై అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ గౌరవాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పోలుస్తూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కాంగ్రెస్ నాయకుడు చేసిన ఈ పోలికను బీజేపీ తీవ్రంగా ఖండిస్తూనే రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై పదునైన విమర్శలతో విరుచుకుపడింది.

కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర రాజ్‌పుత్ ఈ వివాదానికి తెర తీశారు. వెనిజులాలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి, అణచివేతకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేసినందుకు మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించిన వెంటనే.. రాజ్‌పుత్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి రాజ్యాంగాన్ని కాపాడినందుకు వెనిజులా ప్రతిపక్ష నేతకు దక్కిందని గుర్తు చేశారు. భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజ్యాంగాన్ని రక్షించే పోరాటం చేస్తున్నారు అని ఆ పోస్టులో రాజ్‌పుత్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు పరోక్షంగా రాహుల్ గాంధీకి కూడా నోబెల్ బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా ఉండటంతో.. రాజ్‌పుత్ పోస్ట్‌ను ఆయుధంగా చేసుకున్న బీజేపీ.. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. రాజ్‌పుత్ చేసిన పోలికను అర్థం లేనిదిగా అభివర్ణించారు.

విచిత్రమైన కాంగ్రెస్ రాహుల్ బాబాకు నోబెల్ బహుమతి కావాలని డిమాండ్ చేస్తోందన్నారు. హిపోక్రసీ, అబద్ధాలు చెప్పడం, 99 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడం, అలాగే 1975, 1984లలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీచేయడం వంటి వాటికి ఏమైనా ప్రత్యేక నోబెల్ బహుమతి ఉంటే మాత్రం... అది రాహుల్ గాంధీకే లభిస్తుంది అని పూనావాలా ఎద్దేవా చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ చరిత్రలోని వివాదాస్పద అంశాలను, ఎమర్జెన్సీ నాటి ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన రాహుల్ గాంధీపై విమర్శలకు దిగారు.

మొత్తం మీద నోబెల్ శాంతి బహుమతిని ఒక రాజకీయ పోలికకు ఉపయోగించడం, దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అధికార పక్షం, ప్రతిపక్షంపై పదునైన విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.

Related News