రాముడు అయోధ్యలో పుట్టలేదన్నందుకు పదవి నుంచి దింపేశారు.. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ

Image 1

నేపాల్‌లో యువత చేపట్టిన జన్ జి హింసాత్మక అందోళనల దెబ్బకు రాజీనామా చేసిన ప్రధాన మంత్రి కేపీ ఓలీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి నుంచి తప్పుకున్న అనంతరం తొలిసారి ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. భారత్‌పై ఆరోపణలు చేయడం గమనార్హం. ముందు నుంచి భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న ఓలీ.. పదవి కోల్పోయిన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారు. రాముడు అయోధ్యలో పుట్టలేదని అన్నందుకే పదవి కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతోన్న ఆందోళనల గురించి లోతుగా వ్యాఖ్యలు చేయలేదు కానీ, తన ప్రకటనలో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురలు నేపాల్‌ భూభాగాలేనని పునరుద్ఘాటించడం గమనార్హం.

రాజీనామా తర్వాత మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేపాల్ విడిచి వెళ్లిపోయినట్టు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖను బట్టి స్పష్టమవుతోంది. ప్రస్తుతం నేపాల్ ఆర్మీకి చెందిన శివపురి బ్యారెక్‌లో ఓలీ భద్రంగా ఉన్నారు. పార్టీకి రాసిన బహిరంగ లేఖలో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురపై నేపాల్ వాదనలతో సహా జాతీయ సమస్యలపై తన దృఢమైన వైఖరిని ఆ దేశ మాజీ ప్రధాని పునరుద్ఘాటించారు. రాముడి జన్మస్థలం అయోధ్యలో కాదు, నేపాల్‌లో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

దేశానికి సంబంధించిన నిర్ణయాలు, చర్యల విషయంలో జాగ్రత్తగా ఉన్నానని అన్నారు. తాను మొండిపట్టుదల కలిగిన మనిషినని, రాముడి జన్మస్థలం నేపాల్ అనే వాదనకు కట్టుబడి ఉన్నానని, లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురల నేపాల్ భూభాగాలేనని స్పష్టం చేశారు. ఈ కఠిన వైఖరి వల్లే తాను అధికారాన్ని కోల్పోయానని, ఈ విషయాలే తన రాజకీయ పతనానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌ యువతలో ఆగ్రహానికి కారణమైంది.

‘‘సహజంగా నేను కొంచెం మొండివాడిని.. ఆ మొండిపట్టుదలే లేకపోయింటే చాలాకాలం కిందటే ఈ సవాళ్లకు భయపడి వెనక్కితగ్గేవాడ్ని... అదే వైఖరితో మన దేశంలో పనిచేస్తోన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ప్రభుత్వ నిబంధనలు పాటించి, స్థానికంగా రిజిస్టర్ చేసుకోవాలని డిమాండ్ చేశాను.. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా నేపాల్‌కే చెందుతాయి.. శ్రీరాముడు నేపాల్‌లోనే పుట్టారని, భారత్‌లో కాదని శాస్త్రాలు చెప్పినదాన్నే నేను నొక్కిచెప్పాను.. ఈ విషయంలో నేను రాజీ పడుంటే అనేక సులవైన మార్గాలను ఎంచుకుని, పలు ప్రయోజనాలు పొందేవాడిని.. లింపియాధురాతో కూడి కొత్త మ్యాప్‌ను ఐక్యరాజ్యసమితికి పంపించకపోయినా.. ఇతరులు నాకు బదులుగా నిర్ణయం తీసుకోడానికి అనుమతించినా.. నా జీవితం భిన్నంగా ఉండేదేమో.. కానీ, నేను దేశం కోసమే అన్నీ అర్పించాను.. నాకు పదవి, ప్రతిష్ఠ ఎప్పుడూ ముఖ్యం కాదు’’ అని లేఖలో పరోక్షంగా భారత్‌వైపు ఓలీ వేలెత్తిచూపారు. తమ దేశంలో జరుగుతోన్న ఆందోళనలకు భారత్ కారణమని అర్ధం వచ్చేలా ఉన్నాయి ఆయన ఆరోపణలు.

Related News