ప్రజా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ఈ మార్పులు ఎక్కువగా ఉన్నాయి. అంతా బాగున్నప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయాలనే భావన క్రమంగా పెరిగింది. పొదుపు, మదుపు సూత్రాలను పాటించాలనే ధోరణి నుంచి బయటకివచ్చి నచ్చినట్లుగా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యటనలు, విందులు, విలాసాలకు ఖర్చులు బాగా పెరిగాయి. దాదాపుగా దేశమంతటా ఇదే ధోరణి ఉంది. దేశంలోనే కాదు, భారతీయులు విదేశాల్లోనూ విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. గత 15 ఏళ్లలో విదేశాల్లో దాదాపు రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేశారు. 2009-10తో పోలిస్తే ఇది 1000 రెట్లు ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
ఈ 15 లక్షల కోట్ల రూపాయల్లో ఎక్కువగా పర్యటనల కోసమే ఖర్చు చేశారు. ఆ తర్వాత చదువు, పెట్టుబడులు, ఇతరాలు ఉన్నాయి. 10 ఏళ్ల కిందటివరకు విదేశాల్లో ఎక్కువగా చదువు కోసం ఖర్చు చేసేవారు. గత కొన్నేళ్లలో విదేశాల్లో విహారయాత్రల కోసం ఖర్చు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. విదేశాల్లో పెట్టుబడులు, స్థిరాస్తుల కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.
2009-10 వరకు భారతీయులకు విదేశాల్లో చదువుకోవడమే మొదటి ప్రాధాన్యతగా ఉండేది. 2024-25 నాటికి పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు ఈక్విటీ, రియల్ ఎస్టేట్ లాంటి వాటితో పాటు విదేశీ పర్యటనలకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. చదువు కంటే కూడా విదేశీ విహారయాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఎక్కువగా ఏయే దేశాలకు వెళ్తున్నారు?
2010 వరకు భారతీయులు ఎక్కువగా అమెరికా, యూకే దేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు ప్రపంచమంతా చుట్టేస్తున్నారు. ముఖ్యంగా టర్కీ, ఫ్రాన్స్, యూరప్ దేశాలు, మారిషస్, సింగపూర్, థాయిలాండ్, బ్రెజిల్, చైనా లాంటి దేశాలకు వెళ్తున్నారు.
2009లో కేవలం 1.1 కోట్ల మంది భారతీయులు మాత్రమే విదేశాలకు వెళ్లారు. కోవిడ్-19 మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో కాస్త తగ్గినట్లే కనిపించినా, 2022 నాటికి మళ్లీ 2 కోట్ల మార్కును దాటేసింది.
2009-10లో భారతీయులు విహారయాత్రల కోసం 17 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 2024-25 నాటికి ఆ ఖర్చు ఏకంగా 58.2% పెరిగి 17 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ.15 లక్షల కోట్ల (రూ.14,89,24,37,18,900)కు సమానం. 2009-10లో పోలిస్తే, ఇది దాదాపు 1,000 రెట్లు ఎక్కువ.
‘భారతీయులు ఇప్పుడు విదేశాల్లో చదువుకోవడం కంటే కూడా ఎక్కువ డబ్బును విహారయాత్రలకే ఖర్చు చేస్తున్నారు’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొన్నారు.
విదేశాల్లో చదువుకోవడానికి కూడా బాగానే ఖర్చు చేస్తున్నారు. ఉన్నతమైన కెరీర్, మంచి జీవితం కోసం చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ మంచి చదువు, ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నారు. దీని కోసం భారీగానే డబ్బులు పెడుతున్నారు. ఉద్యోగం సంపాదించిన వాళ్లు విదేశాల్లో ఇల్లు, ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నారు. యూఎస్, కెనడా, యూకే లాంటి దేశాల్లో స్థిరపడాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది.
విదేశాల్లో భారతీయుల ఖర్చు ఏ స్థాయిలో పెరిగిందంటే..
భారతీయులు 2024-25లో విదేశీ విద్య కోసం 9.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 2009-10లో ఈ ఖర్చు 549 మిలియన్ డాలర్లు మాత్రమే. అంటే, 15 ఏళ్లలో ఇది 21% వృద్ధి రేటుతో 17 రెట్లు పెరిగింది.
మొత్తంగా చూస్తే, విదేశాల్లో భారతీయుల ఖర్చు 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో వైద్య ఖర్చులు, డిపాజిట్లు కూడా ఉన్నాయి. 2009-10లో ఈ మొత్తం ఖర్చు 983 మిలియన్ డాలర్లు మాత్రమే. అంటే, 15 ఏళ్లలో ఇది 25.5% వృద్ధి రేటుతో ఏకంగా 30 రెట్లు పెరిగింది.
విదేశాల్లో భారతీయులు విహారయాత్రలతో పాటుగా కుటుంబ సభ్యుల బాధ్యతలు, బహుమతులు ఇవ్వడం, చదువుకోవడం, పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం, ఆస్తులు కొనడం లాంటి వాటిపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. వైద్యం కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో వివిధ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం కూడా పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.
భారతీయులు విదేశాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడానికి ప్రధాన కారణం ఆర్థికంగా మెరుగుపడటమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ‘చాలా మంది భారతీయులు ఇప్పుడు సులభంగా విదేశాలకు వెళ్లగలుగుతున్నారు. అక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వీరి వల్ల విదేశీ కరెన్సీ కూడా మన దేశానికి చేరుతోంది’ అని చెబుతున్నారు.