పంధ్రాగస్టు వేళ ప్రధాని మోదీ మరో రికార్డు.. ఏకంగా 103 నిమిషాలు

Image 1

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఏకంగా 1.43 గంటల అంటే 103 నిమిషాల పాటు మోదీ ప్రసంగించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఉదయం 7.34 గంటలకు మొదలైన ఆయన ప్రసంగం 9.17 గంటల వరకూ కొనసాగింది. దీంతో గతేడాది పంద్రాగస్టు ప్రసంగం 98 నిమిషాల రికార్డును అధిగమించినట్టయ్యింది. . తొలిసారి 2014 ఆగస్టు 15న మోదీ 65 నిమిషాల పాటు ప్రసంగించారు.

ఆ మరుసటి ఏడాది మొట్టమొదటి స్వాతంత్య్ర దినోవత్సం సందర్భంగా భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేసిన 72 నిమిషాల ప్రసంగం రికార్డును మోదీ బద్దలుగొట్టారు. 2015లో 88 నిమిషాల పాటు మోదీ మాట్లాడారు. ఆ తర్వాత 2016లో 96 నిమిషాలు ప్రసంగించారు.అయితే, 2017 మాత్రం మోదీ కేవలం 56 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకే ప్రసంగాన్ని తగ్గించుకున్నట్టు ఆ తర్వాత మన్‌ కీ బాత్‌లో మోదీ వెల్లడించారు. కానీ, 2018లో 83 నిమిషాలు (1.23 గంటలు), 2019లో 92 నిమిషాలు (1.32 గంటలు), 2020లో 90 నిమిషాలు (1.30 గంటలు), 2021లో 88 నిమిషాలు (1.28 నిమిషాలు), 2022లో 74 నిమిషాలు (1.14 నిమిషాలు), 2023లో 90 నిమిషాలు (1.30 గంటలు) ల పాటు మోదీ ప్రసంగం చేశారు.

ఎర్రకోట పై నుంచి మోదీ 12వసారి జాతీయ జెండాను ఆవిష్కరించి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. ఇప్పటి వరకూ అత్యధికంగా జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమ 17 సార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఇక, 1956లో కేవలం 14 నిమిషాల్లో నెహ్రూ తన ప్రసంగం ముగించగా.. ఇందిరా గాంధీ 1966లో 14 నిమిషాలే మాట్లాడారు.

అలాగే, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయిలు కూడా తక్కువ సమయం ప్రసంగించారు. మన్మోహన్ 10సార్లు జాతినుద్దేశించి ప్రసంగించి.. 50 నిమిషాల్లోనే ప్రసంగం పూర్తిచేయడం విశేషం. 2005, 2006లో మాత్రమే 50 నిమిషాలు మాట్లాడిన మన్మోహన్.. మిగతా ఎనిమిదేళ్లు 32 నుంచి 45 నిమిషాల మధ్య ప్రసంగించారు. 2012లో 32 నిమిషాలు, 2013లో 35 నిమిషాల్లోనే మన్మోహన్ ప్రసంగం ముగియడం గమనార్హం. ఇక, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 2002లో 25, 2003లో అరగంట మాత్రమే మాట్లాడారు.

Related News