ట్రంప్ టారిఫ్‌లకు గట్టి షాకిచ్చిన భారత్.. రూ.31,500 కోట్ల భారీ ఒప్పందానికి మోదీ సర్కార్ బ్రేకులు!

Image 1

భారత ఎగుమతుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. గురువారం (ఆగస్ట్ 7) నుంచి అమెరికాలోకి ఎగుమతి అయ్యే వస్తువులకు 25 శాతం టారిఫ్‌లు విధిస్తూ.. ట్రంప్ మొదట ఉత్తర్వులు జారీ చేయగా.. తాజాగా బుధవారం (ఆగస్ట్ 6) వీటికి అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించనున్నట్లు మరో బాంబ్ పేల్చారు. దీంతో మొత్తంగా భారత్‌పై అమెరికా 50 శాతం పన్నులు విధించినట్లయింది. మరోవైపు.. అమెరికా సుంకాల పెంపుతో దేశంలోని రాజకీయ పార్టీలతోపాటు, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సుంకాలకు తలొగ్గేది లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుని.. అమెరికాతోపాటు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.

భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో అమెరికాతో జరిగిన బోయింగ్ విమానాల కొనుగోలు డీల్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆపేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 6 బోయింగ్ బీ-8ఐ (Boeing P-8I) మారిటైమ్ పెట్రోల్ విమానాలు కొనుగోలు చేసేందుకు 3.6 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందం ఇప్పుడు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి 2021లోనే అమెరికా విదేశాంగ శాఖ ఆమోద ముద్ర వేసింది. అయితే సప్లై చైన్‌లో అంతరాయాలు ఏర్పడటం.. ద్రవ్యోల్బణం, తాజాగా భారత ఎగుమతులపై ట్రంప్ విధించిన సుంకాలు నేపథ్యంలో విమానాల ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి.

రక్షణ శాఖ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ వ్యయం దాదాపు 50 శాతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు, విమానాలను తయారు చేసేందుకు కావాల్సిన స్పేర్ పార్ట్స్, టూల్స్ ధరలను భారీగా పెంచేశాయి. ఈ అదనపు వ్యయాన్ని బోయింగ్ సంస్థ, వాటిని కొనుగోలు చేసే భారత ప్రభుత్వంపై వేయడంతో ఈ బోయింగ్ విమానాల కొనుగోలు ఒప్పంద వ్యయం భారీగా పెరిగిపోయింది.

భారీగా పెరిగిన ధరలకు తోడు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మారడం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ ఈ డీల్‌ను రద్దు చేసి.. దాన్ని మళ్లీ పరిశీలించాలని నిర్ణయించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వివరాలు గానీ.. దాన్ని రద్దు చేయడం గురించి గానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు.. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య సుంకాల వివాదం కొనసాగుతుండగానే.. ఎయిర్ ఇండియా సంస్థ.. తన పాత బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలను ఆధునీకరించడానికి అమెరికాకు పంపించడం మొదలుపెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి.. ఇందులోని తొలి విమానం తిరిగి భారత్‌కు చేరనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎయిరిండియా వద్ద మొత్తం 33 డ్రీమ్‌లైనర్‌ విమానాలు ఉండగా.. ఆధునికీకరణ తర్వాత అందులో 20 బిజినెస్ క్లాస్‌ సీట్లు, 25 ప్రీమియం ఎకానమీ సీట్లతోపాటు ఎకానమీలో 205 సీట్లు ఉంటాయని ఎయిరిండియా తెలిపింది.

Related News