బెంగళూరు తొక్కిసలాట.. కోహ్లీకి బిగ్ షాక్ తప్పదా!

Image 1

18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 టైటిల్ సాధించిన ఆర్సీబీకి ఆ తర్వాత ఏదీ కలిసి రావడం లేదు. ఈ విజయాన్ని బెంగళూరులో ఘనంగా సెలబ్రేట్ చేసుకుందామని.. ఆ జట్టు భావించింది. అయితే లక్షలాది మంది ఫ్యాన్స్ తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటన పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఇప్పటికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. సామాజిక కార్యకర్త వెంకటేష్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. 11 మంది మృతికి కారణమైన తొక్కిసలాట RCB యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచిత పాస్‌లు, ఆటగాళ్లతో ముఖాముఖి కలిసే అవకాశం కల్పిస్తామని చేసిన ప్రకటనల వల్లే లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారని వివరించారు.

ఇక జట్టులో కీలక ఆటగాడిగా, ప్రజల్లో భారీ పాపులారిటీ ఉన్న విరాట్ కోహ్లీకి కూడా ఇందులో భాగం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభిమానులను కార్యక్రమానికి హాజరు కావాలని కోహ్లీ ప్రోత్సహించాడని, కానీ ఎటువంటి భద్రతా హెచ్చరికలు జారీ చేయలేదని అన్నారు. ఈ తొక్కిసలాటకు కోహ్లీ కూడా బాధ్యుడేనని ఫిర్యాదులో ఉన్నట్లు సమాచారం.

కోహ్లీపై దాఖలైన ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగానే పరిగణిస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ కేసులో కోహ్లీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇక పోలీసులు ఇప్పటికే ఈ ఘటనలో ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related News