భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. సుంకాల మోత మోగిస్తోన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారనే వంకతో భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే వీటిని మరింతగా పెంచుతానంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఆసక్తికరంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఎలా డీల్ చేయాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి కొన్ని సలహాలు ఇస్తానని అన్నారు. ‘‘డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరూ నాకు మంచి మిత్రులు.. అమెరికా అధ్యక్షుడితో ఎలా వ్యవహరించాలో భారత ప్రధానికి సలహాలు ఇస్తారు.. కానీ, వాటిని ఆయనకు వ్యక్తిగతంగా మాత్రమే చెబుతా’’ అంటూ ఇండియాకు చెందిన జర్నలిస్టుల బృందంతో జరిగిన సమావేశంలో తెలిపారు. అంతేకాదు, తాను త్వరలోనే భారత్ పర్యటనకు వస్తానని చెప్పారు.
భారత్- అమెరికాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయన్న నెతన్యాహు.. టారిఫ్ల వివాదాన్ని తక్షణమే పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచించారు. వారి వారి జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా... ఏకాభ్రిపాయంతో ముందుకెళ్లాలని హితవు పలికారు. ఈ రెండూ తమకు మిత్రదేశాలైనందున వివాదం పరిష్కారం ఇజ్రాయెల్కూ మేలు చేస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. తీవ్రవాదంపై పోరులోనూ భారత్తో కలిసి పనిచేస్తామని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటామని తెలియజేశారు. అటు, ఇజ్రాయెల్లోని భారత దౌత్యవేత్త జేపీ సింగ్తోనూ భేటీ అయిన బెంజిమిన్ నెతన్యాహు .. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
చుక్కలు చూపిస్తున్న బంగారం.. తులం@లక్ష
కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇజ్రాయెల్ తయారీ ఆయుధాలను భారత్ వినియోగించింది.. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారానికి ఇది నిదర్శనమని ఆయన బెంజిమిన్ నెతన్యాహు అన్నారు. యుద్ధ క్షేత్రంలో ఇజ్రాయెల్ ఆయుధాలు చాలా సమర్ధవంతంగా పనిచేశాయని పేర్కొన్నారు. ‘‘ భారత్ చాలా పెద్ద దేశం.. అన్ని ప్రాంతాల్లో నిఘా అంత సులభం కాదు.. కాబట్టి భారత్కు గగనతల నిఘా వ్యవస్థలో సహయానికి సిద్ధంగా ఉన్నాం..నిఘా సమాచారంతో పాటు, ఉగ్రవాదులు దాడి చేసే ముందు వారిని పట్టుకునే భౌతిక సామర్థ్యం మనకు అవసరం.. మనం ఎల్లప్పుడూ ముందుండాలి,.. మనల్ని విచ్ఛిన్నం చేయడానికి అనుమతించకూడదు, రాబోయే దానికంటే ముందే మనం చర్య తీసుకోవాలి’’ అని నెతన్యాహు అన్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్తో కొనసాగిన సైనిక ఘర్షణల్లో హర్పిల్ డ్రోన్లతో పాటు డీఆర్డీఓతో కలిసి ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బరాక్- 8 క్షపణులను భారత్ సైన్యం ఉపయోగించింది.