పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవలే అమెరికా పర్యటన వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడే భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన.. అణుబాంబు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయితే అగ్రరాజ్యం వేదికగా ఆయన ఇలాంటి కామెంట్లు చేయడంతో.. అమెరికా-భారత్ల మధ్య కూడా బంధం చెడినట్లు చాలా మంది భావించారు. ముఖ్యంగా ఇండియాపై ట్రంప్ సుంకాలు పెంచడం, ఒకే నెలలో రెండుసార్లు పాక్ ఆర్మీ చీఫ్ అక్కడికి వెళ్లగా.. ట్రంప్-మోదీల స్నేహం చెడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీటిపై తాజాగా అమెరికా స్పందించింది. భారత్తో పాటు పాకిస్థాన్తో తమ సంబంధాలు "ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి" అని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రకటన రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా సిద్ధంగా లేదని, కానీ ఇరు దేశాలతో తమ సంబంధాలను కొనసాగిస్తుందని సూచిస్తోంది.
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికాలో పర్యటనలో ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్కు వ్యతిరేకంగా అణు యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. పాకిస్థాన్కు ఏదైనా ముప్పు కలిగితే.. తాము సగం ప్రపంచాన్ని తమతో పాటు తీసుకుపోతామని మునీర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సింధు నదిపై భారత్ ఏదైనా డ్యామ్ను నిర్మిస్తే.. దానిని పది క్షిపణులతో ధ్వంసం చేస్తామని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించాయి.
దీనికి ప్రతిగా భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో మండిపడింది. అణు బెదిరింపులు చేయడం పాకిస్థాన్కు సర్వసాధారణం అని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ను అణు ఆయుధాలు ఉన్న ఒక బాధ్యతారహిత దేశంగా అభివర్ణించింది. మునీర్ వంటి ఒక కీలక సైనికాధికారి.. మిత్ర దేశమైన అమెరికా గడ్డపై ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విచారకరమని భారత్ పేర్కొంది. భారత్ ఎలాంటి అణు బెదిరింపులకు లొంగిపోదని.. దేశ భద్రతను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.
అయితే పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ.. తమ దౌత్యవేత్తలు భారత్, పాకిస్థాన్ రెండింటికీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అలాగే పహల్గాం ఉగ్రదాడితో ఈ రెండు దేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులను అమెరికానే ఆపిందని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోలు పాక్-భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీసుకు వచ్చేందుకు చాలా కృషి చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని, కానీ ఈ రెండు దేశాలతోనూ తమ సంబంధాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
అమెరికా.. భారత్, పాకిస్థాన్తో కలిసి పని చేయడం ఈ ప్రాంతానికే కాకుండా, ప్రపంచానికి కూడా మంచిదని చెప్పారు. ఇది ప్రయోజనకరమైన భవిష్యత్తును ప్రోత్సహిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాటిపై అంతర్జాతీయ సమాజం యొక్క వైఖరిని మరోసారి ప్రపంచం ముందు ఉంచింది.