ఎయిరిండియాకు చెందిన విమానం గుజరాత్లోని అహ్మాదాబాద్లో సాంకేతికలోపంతో కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాని వద్ద షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. టేకాఫ్ సమయంలోనే కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.
ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కూలిపోయింది. విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా తొలుత అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన తర్వాత జనావాసాలపై పడింది. సరిగ్గా మధ్యాహ్నం 1.38 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా.. వీరిలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేసీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉండగా.. ఒకే ఒక్కడు తప్ప మిగతా వాళ్లంతా చనిపోయారు. మెడికల్ కాలేజీ హాస్టల్ మీద విమానం పడగా.. అందులోని మెడికోలు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు వదిలారు.
ఎక్కువ దూరం కావడంతో విమానంలో భారీగా ఇంధనం నింపడంతో, ప్రమాదం తర్వాత సంభవించిన పేలుడు, మంటలు తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాద కారణాలపై దర్యాప్తునకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా చర్యలు తీసుకుంటోంది.
ప్రమాదానికి గల అనుమానిత కారణాలపై అధికారులు ఇంకా ప్రకటించలేదు. కానీ, అంతర్జాతీయ ప్రయాణం కోసం అధికంగా ఇంధనం నింపడం వల్ల ప్రమాదం అనంతరం మంటలు మరింత విస్తరించి, సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని నిపుణులు అభిప్రాయపడడ్డారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష సంగవీ, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్లతో మాట్లాడారు. ఈ ప్రమాదానికి సంబంధించి రాష్ట్రానికి అవసరమైన అన్ని సహాయాన్ని కేంద్రం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రమాదంపై ప్రకటన విడుదల చేసిన ఎయిరిండియా ‘విమానం AI171 అహ్మదాబాద్–లండన్ గ్యాట్విక్ మార్గంలో ప్రయాణిస్తుండగా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం, వివరాలు సేకరిస్తున్నాం’ అని పేర్కొంది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.