కోలీవుడ్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ఎస్ ఎస్ రాజమౌళి గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి సినిమాలు తీసే వ్యక్తి అని కొనియాడారు.
''శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్ గా, హంబుల్ గా ఉంటారు. ఆయన్ను చూసిన వెంటనే మనకి అదే అనిపిస్తుంది. కానీ ఆయన చాలా చాలా మొండి పట్టుదలగల వ్యక్తి. తాను నమ్మిన సిద్ధాంతానికి, తను నమ్మిన సూత్రాలకు ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపించినా, ఎలాంటి పరిస్థితులొచ్చినా ఒక ఇంచు కూడా పక్కకి జరగరు. ఆయనలోని ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది. నమ్మిన సిద్ధాంతాల మీదే సినిమాలు తీస్తాడు. నేను నమ్మిన సిద్ధాంతాలకు, చేసే సినిమాలకు అస్సలు సంబంధం ఉండదు. పూర్తిగా వ్యతిరేకం. శేఖర్ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే ఉంటాడు కాబట్టి ఆయనంటే నాకు రెస్పెక్ట్''
''శేఖర్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిందంటే నాకే నమ్మబుద్ది కావడం లేదు. నేను ఇన్నాళ్లూ శేఖర్ కమ్ముల నాకు జూనియర్ అనుకుంటున్నా. నిజానికి నాకంటే ఒక సంవత్సరం సీనియర్. 25 ఏళ్లుగా అలానే ఉన్నాడు.. అలాంటి సినిమాలే తీసాడు. అలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. నాగార్జునతో శేఖర్ కమ్ముల 'కుబేర' అని టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే.. ఇదొక అద్భుతమని అనుకున్నాను. ఆ తరువాత ధనుష్ కూడా ఈ సినిమాలో భాగమని తెలిసింది. వావ్.. వ్యాటే కాంబినేషన్ అనుకున్నాను''
''ట్రాన్స్ ఆఫ్ కుబేర రిలీజ్ చేసిన తర్వాత నిజంగా నా మతిపోయింది. అల్ట్రా నియో రిచ్ ప్రపంచంలో నాగార్జున.. అల్ట్రా పూర్ ప్రపంచంలో ధనుష్.. కథేంటనేది ఏమీ చెప్పకుండా రిలీజ్ చేసిన ఆ వీడియో సినిమా ఏంటనేది తెలియజెప్పింది. శేఖర్ ఇంతకముందు అలాంటి సినిమా చేయలేదు. ఆయన సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ట్రైలర్ లోనే సినిమా ఏంటనేది చెప్పేస్తాడు. కానీ ఈసారి ఒక సస్పెన్స్ సినిమాలాగా చేసాడు''
''పేద, ధనిక ప్రపంచాలను ఎలా కలిపాడు? నాగార్జున, ధనుష్ లను ఏ విధంగా ఒక చోటకి తీసుకొచ్చాడు? వారి మధ్య డ్రామా ఏంటి? అనేది చూడటానికి నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఉత్సుకతను మరింత పెంచింది. నికేత్ విజువల్స్ ఫెంటాస్టిక్ గా, మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతీది టాప్ క్లాస్ గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'నాది నాది' పాట సోల్ ఆఫ్ ది ఫిల్మ్. థీమ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. జూన్ 20న థియేటర్లలో చూడటానికి అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాం'' అని రాజమౌళి అన్నారు.
'కుబేర' ఈవెంట్ లో ఫస్ట్ శాలరీ ఎంత అని యాంకర్ సుమ కనకాల అడగ్గా.. ''నేను అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసినప్పుడు రూ.50 ఇచ్చారు. అదే నా రెమ్యునరేషన్. దానితో ఏం చేసానేది నాకు గుర్తు లేదు'' రాజమౌళి సమాధానం చెప్పారు.