ఎయిరిండియా విమాన ప్రమాదం... చివరి క్షణాల్లో కాక్‌పీట్‌లో ఏం జరిగింది?

Image 1

ఎయిర్ ఇండియా విమానం AI-171, అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన కొద్ది సేపటికే కేవలం 672 అడుగుల ఎత్తుకు చేరుకొని కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కడ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు కాక్‌పిట్‌లో ఏమి జరిగింది? అనేది నిపుణులు విశ్లేషిస్తున్నారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు మొత్తం 242 మంది ఉన్నారు. విమానం గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోయింది. విమానం ఎత్తుకు ఎగిరే విషయంలో ఇబ్బందిపడుతుండటం, ఆ తర్వాత కిందపడిపోతూ భీకర శబ్దంతో పేలిపోవడం వీడియోల్లో కనిపించింది.ఈ వీడియోను విశ్లేషించిన నిపుణుల ప్రకారం.. అత్యంత భద్రత ప్రమాణాలు కలిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ రన్‌వే నుంచి టేకాఫ్ అయ్యింది. కానీ వెంటనే సాధారణ స్థాయిలో ఎగరలేకపోయింది. ఈ సమయంలో పైలట్లు ఎత్తును పెంచేందుకు యోక్‌ను (నావిగేషన్ కంట్రోల్) బలంగా లాగుతూ ఉండొచ్చని నిపుణులు తెలిపారు. వీడియోలో ల్యాండింగ్ గేర్ కూడా కిందే ఉన్నట్లు కనిపించింది.

‘టేకాఫ్ అయిన తరువాత మేడే (Mayday) కాల్ వచ్చింది, అంటే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని అర్థం. లిఫ్ట్ తగ్గిపోతుండగా, పైలట్లు విమాన నోస్‌ను పైకి లాగేందుకు ప్రయత్నించారని, అయినప్పటికీ అది పట్టుకోల్పోతూ కిందకు దిగిపోయింది’ అని నిపుణులు విశ్లేషించారు. ప్రమాదానికి గురయ్యే సమయంలో విమానం వేగం గరిష్ఠంగా 174 నాట్స్ (గంటకు సుమారు 322 కి.మీ. మాత్రమే ఉండటం, ఇది సాధారణంగా అవసరమైన వేగం కంటే తక్కువగా ఉండటం, ఇంజిన్లు తగిన శక్తిని ఉత్పత్తి చేయలేకపోయినట్లు చూపుతుందని చెప్పారు.

‘టేకాఫ్ సరిగానే జరిగింది. కానీ, ల్యాండింగ్ గేర్‌ను పైకి తీసేసే ముందు విమానం కిందకు దిగడం మొదలైంది. ఇంజిన్ శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం లిఫ్ట్ చేయడం ఆపినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలైన కారణం దర్యాప్తులో వెల్లడవుతుంది’ అని మాజీ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ తెలిపారు. బ్లాక్ బాక్స్‌ డేటాను విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలేంటనేది తెలిసే అవకాశం ఉంది.

ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, 7 మంది పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక హాట్‌లైన్ నెంబర్‌ను 1800 5691 444 అందుబాటులో ఉంచింది. అయితే మీడియా ప్రతినిధులు, ఇతర ప్రయాణికులు ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చెయవద్దని ఎయిరిండియా సూచించింది.

Related News