విమానం కాలిబూడిదైనా చెక్కు చెదరని భగవద్గీత.. అహ్మదాబాద్ ఘటనలో అద్భుతం

Image 1

హిందూ పురాణాల్లో భగవద్గీత కు ఎంతో విశిష్ఠత ఉంది. ఇప్పటికీ కోర్టుల్లో సాక్ష్యం చెప్పే సమయంలో భగవద్గీతపై ప్రమాణం చేయిస్తారు. ఎన్నో వింతలు, విశేషాలు, విషయాలు కలిగి ఉన్న భగవద్గీత ఇప్పటివరకు ఎన్నోసార్లు ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కూడా ఈ భగవద్గీతకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలిన ఘటనలో ఎంతటి విధ్వంసం జరిగిందో ఫోటోలు, వీడియోల్లో చూస్తూనే ఉన్నాం. విమానం దాదాపుగా కాలిపోగా.. అది కూలిన భవనం కూడా నేలమట్టం అయింది. విమానం అప్పుడే బయల్దేరడంతో ట్యాంకు నిండా ఉన్న 1.25 లక్షల ఇంధనం బయటికి వచ్చి భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. దాదాపు ఆ సమయంలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే అక్కడే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. విమాన ప్రయాణికులు, సిబ్బంది, పైలట్లు, మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లోని విద్యార్థులు సహా మొత్తం 269 మంది ప్రాణాలు కోల్పోయిన అదే ప్రాంతంలో చెక్కుచెదరకుండా ఉన్న ఒక భగవద్గీత ప్రతి లభించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అతి భారీ అగ్ని ప్రమాదం, తీవ్రమైన వేడి ఉన్నప్పటికీ.. ఈ పవిత్ర గ్రంథం ఏమాత్రం పాడవకుండా ఉండటం విశేషం. అయితే అక్కడ సహాయక చర్యలు అందిస్తున్న సిబ్బంది ఆ భగవద్గీత పుస్తకాన్ని ఆ విమాన శిథిలాల నుంచి బయటికి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఒక వ్యక్తి.. భగవద్గీత పుస్తకాన్ని విమానం కూలిన శిథిలాల నుంచి పైకి తీసి.. ఓపెన్ చేసి.. అందులో ఉన్న పేజీలను చూపించడం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఒక్క పేజీ కూడా ఆ మంటలకు కాలిపోకుండా ఉండటం చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. అయితే ఈ భగవద్గీత పుస్తకం.. ఆ విమానంలో వెళ్తున్న ఒక ప్రయాణికుడికి చెందింది కావచ్చని.. ఆ సమయంలో దాన్ని చదువుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ భగవద్గీత దొరికిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Related News