ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా, బీ అలర్ట్.. కొత్తగా క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్, అస్సలు మోసపోకండి

Image 1

ప్రస్తుత టెక్ యుగంలో.. ప్రపంచమే ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. మన అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ పని అయినా చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో కూర్చొని.. ఫారిన్ బ్రాండ్స్‌కు సంబంధించిన వస్తువులను కూడా మన డోర్ వద్దకే తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ పెరిగిపోవడంతో.. మనకు నచ్చిన వస్తువును ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తే.. డోర్ ముందుకే వస్తోంది. బయటికి వెళ్లి షాపింగ్ చేసి.. కొనుక్కోవాల్సిన అవసరం లేకపోవడం.. ఆన్‌లైన్‌లో భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించడంతో.. చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు అయ్యారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో రోజుకో కొత్త రకమైన మోసాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్ షాపింగ్‌లో జరుగుతున్న మోసాల గురించి.. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉన్న ఓ యువతి చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.

రోజురోజుకూ ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతోపాటు.. అదే రేంజ్‌లో సైబర్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా భారీగా మోసాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ట్విషా తులి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రముఖ కొరియర్ సంస్థల పేరుతో ఈ క్యాష్ ఆన్ డెలివరీ మోసం జరుగుతోందని.. ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయని పేర్కొన్నారు.

మోసాలు ఎలా జరుగుతున్నాయంటే?
ఈ కొత్త రకం క్యాష్ ఆన్ డెలివరీ మోసాన్ని వివరిస్తూ ట్విషా తులి చేసిన ఒక వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ మోసం చేసేవాళ్లు.. కొరియర్ సంస్థలు అయిన డెల్హివరీ (Delhivery), బ్లూ డార్ట్ (Blue Dart), ఈకామ్ ఎక్స్‌ప్రెస్ (Ecom Express), షాడోఫాక్స్ (Shadowfax) వంటి వాటి పేర్లను ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఎవరూ ఆర్డర్ చేయని ఒక ప్యాకేజీని ఇంటివద్దకే పంపించి.. కస్టమర్ల దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలను చేసేందుకు సైబర్ నేరగాళ్లు చాలా కొద్దిమందిని మాత్రమే సెలెక్ట్ చేసి.. వారినే దోచేస్తున్నారు. ఏ ఇంటికి ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు వస్తాయి.. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే వివరాలు అన్నింటినీ ఈ సైబర్ మోసగాళ్లు సేకరించినట్లు ట్విషా తులి వెల్లడించారు.

ఈ క్రమంలోనే ట్విషా తులి.. తనకు జరిగిన ఒక సొంత అనుభవాన్ని కూడా ఆ వీడియోలో వివరించారు. తన కుటుంబంలో ఒకరి పేరు మీద.. మొదటగా ఒక ప్యాకేజీ వచ్చిందని.. అయితే తాము ఆర్డర్ చేయకుండానే పార్సిల్ వచ్చిందని గుర్తించిన తమ కుటుంబ సభ్యులు దాన్ని తిరిగి వెనక్కి పంపించేశారని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకు.. తన ఇంటికి వేరే కుటుంబ సభ్యుడి పేరుతో మరో ప్యాకేజీ వచ్చిందని.. అయితే అది నిజమైన ఆర్డర్ అని నమ్మి ఆ వ్యక్తికి రూ.700 చెల్లించారని పేర్కొన్నారు. అయితే ఆ ప్యాకేజీని ఓపన్ చేసి చూడగా.. అందులో చైనీస్ భాషలో రాసిన ఒక వస్తువును మాత్రమే ఉంచారు. ఆ ప్యాకేజీపై క్యూఆర్ కోడ్ ఉండగా.. అది కూడా పని చేయడం లేదు. మరోవైపు.. అప్పటికే మోసం జరగ్గా.. బాధితుడి నుంచి డబ్బులు పోయాయి.

అయితే ఇలాంటి మోసాల వలలో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ట్విషా తులి ఈ వీడియోలో వివరించారు. చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా.. అందర్నీ సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారని పేర్కొన్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌ చేయడంలో అనుభవం ఉన్నవారు కూడా ఈ మోసం బారిన సులభంగా పడతారని తెలిపారు. ఎందుకంటే మనకు వచ్చే ప్యాకేజీని నమ్మకమైన కొరియర్ సంస్థ డెలివరీ చేస్తుండటంతో అది నిజమేనని భావించి.. డబ్బులు చెల్లించి మోసపోతున్నారు.

మోసాల నుంచి తప్పించుకోవడానికి సూచనలు

ఏదైనా ఆర్డర్ వస్తే డబ్బు చెల్లించడానికి ముందే.. దాన్ని మీరు ఆర్డర్ చేశారా లేదా అనేది నిర్ధారించుకోండి.
ప్యాకేజీపై పేరు ఉన్నంత మాత్రాన అది నిజమైందని నమ్మకూడదని మీతోపాటు మీ కుటుంబానికి కూడా చెప్పండి.
ఏవైనా అనుమానాస్పద ఆర్డర్లు డెలివరీ వస్తే వెంటనే సంబంధిత కొరియర్ సంస్థకు సమాచారం ఇవ్వండి.

అయితే ఈ క్యాష్ ఆన్ డెలివరీ మోసంలో వస్తువులను అందించే.. కొరియర్ సంస్థలకు ఎలాంటి పాత్ర ఉండదని.. ట్విషా తులి స్పష్టం చేశారు. సైబర్ మోసగాళ్లు కేవలం ఈ డెలివరీ సంస్థల నెట్‌వర్క్‌ను మాత్రమే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా.. సురక్షితంగా ఉండటానికి ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండటం చాలా అవసరమని ట్విషా తులి సూచించారు.

Related News