భాషా సేవే భావితరాల సేవ అనే నినాదంతో ఖండాతరాల్లో ఉన్న ప్రవాసుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తోంది "సిలికానాంధ్ర మన బడి". గత కొన్నేళ్లుగా అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించడంలో సఫలీకృతమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే న్యూజెర్సీలోని మెటావన్ హైస్కూల్లో మన బడి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలంతా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో పట్టభద్రులైన విద్యార్థులకు నిర్వాహకులు పట్టాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. తమ పిల్లలు పట్టాలు అందుకోవటం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు.
ఈ స్నాతకోత్సవానికి గుండపునేని వెంగళ్ రావు, ఓరుగంటి వేణు, ప్రాంతీయ సమన్వయకర్త కన్యాకుమారి పేరూరి, మహేష్ నాగేళ్లతో పాటు, దుద్దాగి కిరణ్, కోగంటి సమత, గబ్బిట రాజీవ్, గంగాధర్ గ్రాంధీ తదితరులు ముఖ్య అథితులుగా హాజరై.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. పట్టభద్రులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి గొప్ప మాటలు చెప్పారు. తెలుగు భాష నేర్చుకోవటం, తెలుగు సంస్కృతిని పాటించటానికి గల ప్రాముఖ్యతను వక్తలు వివరించారు. సిలికానాంధ్ర మనబడి చేస్తున్న ఈ కృషికి విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న సహకారానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.