ఎడిసన్, న్యూజెర్సీ: మాతృభూమిపై మమకారాన్ని చాటుతూ, దేశ ప్రగతికి సంఘీభావం తెలిపే అపూర్వమైన కార్యక్రమానికి అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ సిద్ధమైంది. భారతదేశ ఐక్యత, ప్రగతిని ప్రదర్శించేందుకు గాను 'వికసిత్ భారత్ రన్' నిర్వహించేందుకు న్యూజెర్సీలోని ప్రఖ్యాత శ్రీ శివ విష్ణు ఆలయం (సాయి దత్త పీఠం) పిలుపునిచ్చింది.
న్యూజెర్సీలోని భారతీయ అమెరికన్ కమ్యూనిటీ మద్దతుతో, న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో సాయి దత్త పీఠం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28న నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటలకు 1665 ఓక్ట్రీ రోడ్, ఎడిసన్, NJ లోని శ్రీ శివ విష్ణు ఆలయ పార్కింగ్ స్థలం నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమలో పాల్గొన్న వారందరికీ ఆలయ నిర్వాహకులు అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశ ప్రగతికి సంఘీభావం తెలిపే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రవాస భారతీయులంతా పాల్గొనాలని సాయి దత్త పీఠం పిలుపునిచ్చింది.
30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణం:
మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ పరుగు ప్రధాన లక్ష్యం. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకమనే సందేశాన్ని ఈ రన్ ద్వారా చాటి చెప్పనున్నారు. భారత్-అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారనుంది. స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.